మాలపిల్ల, రైతు బిడ్డ వంటి ప్రయోజనాత్మక చిత్రాలు నిర్మించిన సారథీ రామబ్రహ్మం ఆ పతాకంపై ‘ పత్ని’ అని విలక్షణ చిత్రాన్ని 1942లో అందించారు. మంచి బలమైన కథ. ఇది భార్యాభర్తల కు సంబంధించినది. రాజు కొలువులో పనిచేసే కోవలన్ రాజనర్తకి ప్రేమలో పడతాడు. అతని మీద రాజుగారి ధనాగారం నుంచి ఒక హారం దొంగిలించినట్లు అభియోగం పడుతుంది. అయితే అతని భార్య కన్నగి ఆ హారం తనదే అని రుజువు చేసింది. ఈమె రుజువు చేసే లోపలే అతనికి మరణశిక్ష అమలు అవుతుంది. నిర్దోషయైన తన భర్తను తనకు ఇవ్వమని రాజు నిలదీసింది కన్నగి. ఆగ్రహించిన కన్నగి పాతివ్రత్య మహిమతో మధుర పట్టణం సర్వనాశనం అవుతుంది. సూక్ష్మంగా ఇదీ కథ.
Click Here to go to Patni (1942) Movie Page.
ఇందులో కథానాయిక పాత్రలో ఋష్యేంద్రమణి నటన, అందం చిత్రానికి వన్నె తెచ్చాయి. కథానాయకుడు కోవలన్ గా ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు నటించారు. ఆయన ఆజానుబాహువు, ఆరడుగుల అందగాడు.
ఈ చిత్రానికి తాపీ ధర్మారావు రచన చేయగా కొప్పరపు సుబ్బారావు సంగీతాన్ని సమకూర్చారు. ఇతర ముఖ్య పాత్రల్లో సురభి కమలాబాయి, హైమావతి, వంగర వెంకట సుబ్బయ్య, కొచ్చర్లకోట సత్యనారాయణ నటించారు. ఈ చిత్రంతో అటు సాంఘిక మే కాదు ఇటు విజయవంతమైన జానపదం కూడా తీయగలననిపించుకున్నారు. దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం.
ఇక్కడ ఈ చిత్ర కథానాయిక ఋష్యేంద్రమణి గూర్చి ముచ్చటగా మూడు మాటలు చెప్పుకోవాలి. చింతామణి, సావిత్రి నాటకాల ద్వారా రంగస్థల నటిగా పేరుపొందిన ఋష్యేంద్రమణి 1935లో ‘ శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంలో సత్యభామ పాత్రలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె అందానికి, నటనా పటిమకు పూర్తిగా అవకాశమిచ్చినది ఈ ‘పత్ని’ చిత్రంలోని కథానాయిక కన్నగి పాత్ర. తర్వాత కాలంలో ‘ విప్రనారాయణ’ లో వేశ్య మాతగా, గులేబకావళి కథ, పాండురంగ మహత్యం, జగదేకవీరుని కథ చిత్రాలలోనూ కథానాయకుని తల్లిగా, ‘ మాయాబజార్ ‘లో సుభద్ర గా, ‘సంఘం’లో ఎస్.వి.రంగారావు సరసన అప్పాయమ్మగా , ఇంకా పలు చిత్రాలలో వయసుమళ్ళిన పాత్రల్ని అద్భుతంగా పోషించి జీవితాన్ని పూర్తిగా నటనకు అంకితం చేసిన ధన్యజీవి.
కె.ఎస్.ప్రకాశరావు అసాధారణ ప్రజ్ఞావంతుడు. సంగీత దర్శకునిగా పెండ్యాల నాగేశ్వరరావును (ద్రోహి) రచయితగా ఆత్రేయను ( దీక్ష) సినీ రంగానికి పరిచయం చేశారు. “ప్రేమ్ నగర్” వంటి ప్రణయ కావ్యాన్ని అందించారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు వీరి కుమారులే.
Source: 101 C, S V Ramarao