కామిగాక మోక్షగామి కాడు. రక్తి, అనురక్తి పరాకాష్టకు చేరాక భక్తియోగంకోసం జీవుడు పరితపించక తప్పదు. ఈ సత్యాన్ని ప్రబోధించిన చిత్రం యోగివేమన. ఆ తరహాలో తెనాలి రామకృష్ణుడు రచించిన గ్రంథం ‘పాండురంగమహాత్మ్యం’ ఆ చిత్రానికి పబ్లిసిటీలో బ్రాకెట్ పెట్టి (భక్తపుండరీకుని కథ) వివరణ కూడా ఇచ్చారు.
Click Here to go to Panduranga Mahatyam (1957) Movie Page.
ఊళ్ళో పుండరీకుడు నిష్టాగరిష్ట కుటుంబానికి చెందిననాడు. తల్లిదండ్రులు నిప్పువంటివారు. పుండరీకుడు కళాపతి అనే నెరజాణతో సంబంధం ఎర్పర్చుకుంటాడు.అతనికి పెద్దలు పెళ్ళిచేస్తారు. మొదటిరోజే భార్యకు సహజస్వభావం రీత్యా కన్నుకొడతాడు. దానిని ఆమె సరదాగా భావించి భర్తను సుఖపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే కళాపతి మోజులోపడ్డ కథానాయకుడు తన ఆస్తి సర్వస్వాన్నీ ఆమెకి అర్పించేస్తాడు.
నీతిచెప్పబోయిన తల్లిదండ్రులపై కినుక వహించి, ఘర్షణ పడి యింటి నుంచి తరిమివేస్తాడు. కాలక్రమేణా పుండరీకుడు వ్యాధిగ్రస్తుడౌతాడు. అప్పుడు కళ్ళు తెరుస్తాడు. రక్తిని భక్తిగా మార్చుకొని పాండురంగని కీర్తిస్తూ చేసిన ఘోరపాపాలకు విలపిస్తాడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. చివరకు పుండరీకుడు భక్తి పారవశ్యంతో పాండురంగనిలో ఐక్యమౌతాడు.
ఈ కథను దర్శకులు కమలాకర కామేశ్వరరావు తెరకు మలచిన తీరు అపూర్వం. అంతకుముందు ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి రెండు చిత్రాల్లోనూ (చంద్రహారం,పెంకిపెళ్లాం) హీరో యన్.టి.రామారావే! ఆ రెండూ ఆర్థికంగా అంతంత మాత్రమే అయినా ఆయనశక్తిసామర్థ్యాలమీద నమ్మకంతో ఈ చిత్ర దర్శకత్వపు బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో దర్శకునిగా కమలాకర కామేశ్వరరావు జీవితమే మారిపోయింది ముఖ్యంగా కృష్ణలీలల్ని, “హే కృష్ణా ముకుందా మురారీ…’ అన్న పాటలో చిత్రీకరించిన విధానం అపూర్వం (ఈ గీతంలో విజయనిర్మల బాలకృష్ణునిగా నటించారు).
సముద్రాల జూనియర్ అందించిన సాహిత్యం, అందుకు టి.వి. రాజు సమకూర్చిన సంగీతం వేనోళ్ళ ప్రశంసలందుకున్నాయి.

తరంతరం నిరంతరం నీ అందం’, ‘వన్నెల చిన్నెలనెర’, ‘నీవని నేనని తలచితిరా’ అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’, చిత్రంలో మొదట్లో కుక్కుటేశ్వరునిపై చిత్రీకరించిన ‘హరహర శంభో’, శివరావుపై చిత్రీకరించిన ‘తోలు తిత్తి ఇది’ అన్న పాటలు ప్రజాదరణ పొందాయి. నాగయ్య గానం చేసి ‘జయ జయ గోకులబాలా ఎంతో హాయిగా ఉంటుంది.
బోగిగా, విరాగిగా, భక్తునిగా ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో యన్.టి.ఆర్. నటన చిరస్మరణీయం. అతని ఇల్లాలిగా అంజలిదేవి, కళావతిగా బి. సరోజాదేవి (ఇది ఆమెకు తెలుగులో పరిచయ చిత్రం), ఆమె చెలికత్తెగా అమ్మాజీ, తల్లిదండ్రులుగా నాగయ్య ఋష్యేంద్రమణి, ఇతర సహాయ పాత్రల్లో శివరావు, కె.వి.యస్. శర్మ తమ నటనతో చిత్రానికి జీవం పోశారు.
28.1.1957న విడుదలయిన ఈ చిత్రం హిట్ కావడానికి యన్.టి.ఆర్. నటన అంతకుమించి ఘంటసాల గానం ఎంతగానో తోడ్పడ్డాయి.
It had a 100-day run in 9 centers and celebrated a silver jubilee in Vijayawada and Guntur centers.
Source: 101 C, S V Ramarao