సాహసానికి మారుపేరయిన డి.ఎల్.నారాయణ ‘దేవదాసు’ అనంతరం వినోదా పతాకంపై నిర్మించిన చిత్రం ‘కన్యాశుల్కం’.
ఒకవిధంగా ఈ చిత్రం తీయడం రిస్కుతో కూడిన పని. కారణం ఇందులోని ముఖ్యపాత్రల్ని కొన్ని సన్నివేశాల్ని అంతకుముందు కొందరు ముక్కలుముక్కలుగా సినిమాల్లో ఉపయోగించుకున్నారు. అంతేకాదు, సామాజికంగా వరకట్న దురారాచం ప్రబలివుంది. కట్నమిచ్చి వధువును కొనుక్కోవడం వంటి కన్యాశుల్కం సమస్య ఆప్పటికి పోయింది. అయినా రంగస్థలంపై ప్రాచుర్యం పొందిన గురజాడ అప్పారావు నాటకం అది. ముందుగా కొంచెం నెగటివ్ టచ్ వున్న గిరీశం పాత్రను అక్కినేనిని అనుకున్నా అది కుదరలేదు. చివరకు యన్.టి.రామారావు ఆ పాత్ర ధరించాల్సి వచ్చింది.
Click Here to go to Kanyasulkam (1955) Movie Page.
కబుర్లు చెబుతూ, బట్లరు ఇంగ్లీషు మాట్లాడుతూ అటు మధురవాణితోనూ ఇటు పూటకూళ్ళమ్మతోనూ రొమాన్స్ సాగించే జులాయి తరహా మనిషి గిరీశం. ఇతగాడికి లౌక్యం పాలెక్కువ. ఉన్న వూళ్ళో అప్పులుచేసి తరువాత శిష్యుడు వెంకటేశంకు చదువు చెప్పే వంకతో పల్లెటూరు చేరతాడు గిరీశం. వెంకటేశం తండ్రి అగ్నిహోత్రావధాన్లు. అతడి కూతురు బుచ్చమ్మకు చిన్నప్పుడే పెళ్ళిచేస్తే భర్త పోగా వితంతునవుతుంది. ఇంగ్లీషు పాఠాలు చెబుతూ, ఆగ్నిహోత్రావధాన్లుకు సంబంధించిన కోర్టు విషయాలు చూసి పెడతానని నెమ్మదిగా బుచ్చమ్మను ప్రేమలోకి దించాలని చూస్తాడు గిరీశం.
రామప్పంతులు అనే మరో లౌక్యుడు మధురవాణికి మరో ప్రియుడు. అయితే ఇతడు లుబ్బావధాన్లు కూతురు మీనాక్షిని చెజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆమె కూడా వితంతువే లుబ్బావధాన్లు మూడుకాళ్ళ ముదుసలి. అతనికి తన కూతురు సుబ్బిని ఇచ్చి చేస్తే ఎక్కువ కన్యాశుల్కం వస్తుందని ఆశిస్తాడు అగ్నిహోత్రావధాన్లు. కరటకశాస్త్రి అతని బావమరిది. తన శిష్యుని చేత సుబ్బి వేషం వేయించి లుబ్దావధాన్లుకు శృంగభంగం కలిగేలా చేస్తాడు. ఈ నాటకాన్ని తెరవెనుకనుంచి మధురవాణి నడిపిస్తుంది.
సంస్కారహృదయం ఉన్న వకీలు సౌజన్యరావు. ముందు మధురవాణితో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా తరువాత నిజం గ్రహించి ఆషాడభూతి వేషాలు వేసే గిరీశంను చివాట్లు పెడతాడు. దాంతో గిరీశం కథ అప్పటికి ముగుస్తుంది.
రంగస్థలం పై యధాతథంగా ప్రదర్శిస్తే కనీసం యేడెనిమిది గంటలు వచ్చే ఈ నాటకాన్ని దర్శకులు పి.పుల్లయ్య, రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి, నిర్మాత డి.ఎల్. తెరకు తగ్గట్టు మూడుగంటల్లో తీర్చిదిద్దారు.
అందరూ ఆయా పాత్రలకు తగినట్టుగా నటించారు. గిరీశంగా చుట్ట కాల్చడం దగ్గర్నుంచి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నటించారు యన్.టి.రామారావు, అలాగే ఆమె తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు అన్నంత గొప్పగా మధురవాణి పాత్రను సావిత్రి పోషించారు. అగ్నిహోత్రావధాన్లుగా విన్నకోట రామన్నపంతులు, కరటకశాస్త్రిగా వంగర, లుబ్దావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావు, సౌజన్యరావుగా గుమ్మడి, బుచ్చమ్మగా జానకి, పూటకూళ్ళమ్మగా ఛాయాదేవి, రామప్పంతులుగా సి.యస్.ఆర్. పోలీసుగా పేకేటి ఆ పాత్రల్ని పండించారు.
చిత్రంలో ప్రత్యేకించి ప్రశంసించవలసిన అంశం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించిన సంగీతం, శ్రీశ్రీ గీతం ఆనందమే అర్థవమైతే, మల్లాది రాసిన చిటారుకొమ్మన మిఠాయిపొట్లం ఆన్న పాటలు వినసొంపుగా వుంటాయి. కథకు అన్వయించిన నృత్యరూపకం ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మకథ’ స్వరరచనకు తగ్గట్టుగా ఉదాత్తంగా చిత్రీకరించబడింది.
26.8.1955న విడుదలయిన ఈ చిత్రం మొదట్లో అంతగా విజయవంతంగాక పోయినా రీపీట్ రన్స్లో ప్రేక్షకులు ఆదరించారు.
Source: 101 C, S V Ramarao